మంత్రాలయం, న్యూస్లైన్: భారత క్రికెట్ జట్టు మంచి ఫామ్లో ఉందని.. కెప్టెన్గా విరాట్ కోహ్లి రాణిస్తాడని మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, విజయ్ భరద్వాజ్ అన్నారు. బుధవారం వారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎం.ఎస్.ధోని సారథ్యంలో భారత జట్టు బాగా పుంజుకుందన్నారు.
అతనికున్న నాయకత్వ లక్షణాలే జట్టు ఈ స్థితిలో ఉండటానికి కారణమన్నారు. డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ల సేవలు జట్టుకు అవసరమన్నారు. జట్టులో ఎవరూ శాశ్వతం కాదని.. కొన్నాళ్లకు ఎవరైనా పదవీ విరమణ పొందాల్సిందేనన్నారు. కోహ్లి నేతృత్వంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్ జట్టు విజయంతో తిరిగి రావాలని వారు ఆకాంక్షించారు. వీరి వెంట రంజీ క్రికెటర్ శశిధర్ ఉన్నారు. స్వామి దర్శనానంతరం వీరికి మఠం దివాన్ బండాచార్ శాలువా కప్పి రాఘవేంద్రుల చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.