ఈసారైనా కోహ్లిని వరించేనా?

17 Sep, 2018 16:51 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’కు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేరును అవార్డుల సెలక్షన్‌ కమిటీ సిఫారుసు చేసింది. కోహ్లిని ‘ఖేల్‌రత్న’కు నామినేట్‌ చేయడం ఇది రెండోసారి. 2016లోనూ అతని పేరును పంపినప్పటికీ ఒలింపిక్స్‌ జరిగిన ఏడాది కావడంతో పతక విజేతలు పీవీ సింధు (బ్యాడ్మింటన్‌), సాక్షి మలిక్‌ (రెజ్లింగ్‌)లతోపాటు దీపా కర్మాకర్‌ (జిమ్నాస్టిక్స్‌)కు ఉమ్మడిగా ఆ అవార్డు ఇచ్చారు. దీంతో కోహ్లికి నిరాశే ఎదురైంది.

మరి ఈసారైనా ఖేల్‌రత‍్న అవార్డు కోహ్లికి దక్కుతుందా..లేదా అనేది కేంద్ర క్రీడాశాఖ చేతుల్లో ఉంది. మరొకవైపు వరల్డ్‌ చాంపియన్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానును కూడా ఖేల్‌రత్నకు సిఫారుసు చేశారు. గతేడాది అమెరికాలో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మీరాబాయి చాను స్వర్ణ పతకం గెలిచింది. కాగా, కోహ్లికి ఖేల్‌రత‍్న అవార్డు దక్కితే మాత్రం మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో సచిన్‌ టెండూల్కర్‌(1997), ఎంఎస్‌ ధోని(2007)లు మాత్రమే ఖేల్‌రత్న అవార్డులు అందుకున్న క్రికెటర్లు.

మరిన్ని వార్తలు