మూడో క్రికెటర్‌గా కోహ్లి..

30 Jun, 2018 13:44 IST|Sakshi

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనతను అందుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన విరాట్ కోహ్లి (9: 8 బంతుల్లో 1 ఫోర్‌) దూకుడుగా ఆడే ప్రయత్నంలో జట్టు స్కోరు 22 వద్ద ఔటయ్యాడు. కానీ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్లు మార్టిన్ గప్తిల్ (2,271 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, బ్రెండన్ మెక్‌కలమ్ (2,140) రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో కోహ్లి(1,992) నిలిచాడు. ఈ క్రమంలోనే షోయబ్‌ మాలిక్‌(1,989)ను కోహ్లి వెనక‍్కినెట్టాడు. కోహ్లి మరో 8 పరుగులు చేస్తే.. టీమిండియా తరపున రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కోహ్లి తర్వాత టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్స్ జాబితాలో రోహిత్ శర్మ (1,949), సురేశ్ రైనా (1,509), మహేంద్రసింగ్ ధోని (1,455) ఉన్నారు.

మరిన్ని వార్తలు