కోహ్లి ఒక్కడికే ఆ జాబితాలో చోటు

6 Jun, 2018 12:36 IST|Sakshi
భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (ఫైల్‌ ఫోటో)

ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే ఆటగాళ్ల జాబితాలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చోటు దక్కించుకున్నారు. 2.4 కోట్ల డాలర్లు (రూ.158 కోట్లు సుమారు) పారితోషికంతో కోహ్లి  83వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫోర్బ్స్‌ పత్రిక రూపొందించిన ‘వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018’ జాబితాలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి ఒక్కడికే చోటు లభించింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ ఫ్లాయిడ్‌ మేవెదర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ ఈ జాబితాలో ఒక్క మహిళా అథ్లెట్ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం కోహ్లికి ఉన్న పాపులారిటీ మరెవరికీ లేదని, సోషల్‌ మీడియా ఫాలోవర్సే దీన్ని ప్రతిబింబిస్తున్నారని ఫోర్బ్స్‌ పేర్కొంది. 

ఒక్క భారత్‌లోనే కాకుండా కోహ్లీ ప్రపంచవ్యాప్తంగానూ ప్రాచుర్యం పొందిన ఆటగాడిగా ఫోర్బ్స్ అభివర్ణించింది. ట్విట్టర్లో ఇప్పటికే ఈయనికి 2.5 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్‌  ఉన్నట్టు వివరించింది. ఫోర్బ్స్‌ రూపొందించిన ఈ జాబితాలో ప్రపంచ నెంబర్‌ 1గా నిలిచిన మేవేదర్‌ పారితోషికం 28.5 కోట్ల డాలర్లు. అంటే  సుమారు రూ.1,881 కోట్లు. మేవెదర్‌ తర్వాతి రెండో స్థానంలో అర్జెంటీనా ఫుట్ బాలర్ లియోనెల్ మెస్సి, మూడో స్థానంలో సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోలు ఉన్నారు. టాప్ 100 ఆటగాళ్ల ఉమ్మడి సంపాదన 3.8 బిలియన్ డాలర్లు. అంటే 2,580 కోట్ల రూపాయలు. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం పెరిగింది. బీసీసీఐ ఇటీవలే విరాట్‌ కోహ్లికి ఏ+ కాంట్రాక్ట్‌ను ఇచ్చింది. పుమా, పెప్సీ, ఆడి, ఓక్లే తదితర పాపులర్‌ బ్రాండ్లకు కోహ్లీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు.

మరిన్ని వార్తలు