ముంబై: ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. తన ఫామ్ను కొనసాగించాలని కోహ్లి భావిస్తుండగా, గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమై కోల్పోయిన రిథమ్ను అందుకోవాలనే యత్నంలో బుమ్రా ఉన్నాడు. దాంతో నెట్ సెషన్లో కోహ్లికే బుమ్రా ఎక్కువ బంతులు వేశాడు. అయితే బుమ్రా బౌలింగ్లో షాట్లు కొట్టడానికి కోహ్లి యత్నించగా, చివరకు కోహ్లిని బుమ్రా ఔట్ చేశాడంట. ఇదే విషయాన్ని మీడియాతో మాట్లాడిన కోహ్లి స్పష్టం చేశాడు.
‘దాదాపు నాలుగేళ్ల నుంచి బుమ్రా జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అయితే బుమ్రా బౌలింగ్లో నెట్స్లో ఔట్ కావడం ఇది రెండోసారి అనుకుంటా. నెట్స్లో అతని బౌలింగ్లో హిట్ చేస్తా. అయితే తాజా నెట్ ప్రాక్టీస్లో భాగంగా చివరి బంతికి ఔటయ్యా. అతనొక అసాధారణ బౌలర్. వరల్డ్ అత్యుత్తమ బౌలర్లలో అతనొకడు. నెట్స్లో కూడా బుమ్రా సీరియస్గానే బౌలింగ్ చేస్తాడు. మీకు ఒక విషయాన్ని చెబుతున్నా. మమ్ముల్ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయడానికి బుమ్రా వెనుకాడాడు. మా తలపై, చేతులపై బంతితో హిట్ చేయడానికి కూడా బుమ్రా సిగ్గ పడడు’ అని కోహ్లి తెలిపాడు. మంగళవారం వాంఖేడే స్టేడియంలో భారత్-ఆసీస్ జట్ల మధ్య తొలి వన్డే జరుగనున్న తరుణంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు.
#TeamIndia Captain @imVkohli hit some boundaries off Bumrah's bowling in the nets today.
Hear what the Skipper has to say about the same 😅 pic.twitter.com/g81FTR5jRT
— BCCI (@BCCI) January 13, 2020