యువీ రిటైర్మెంట్‌.. భావోద్వేగమైన కోహ్లి

10 Jun, 2019 17:55 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా టీ​20, వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన లెజెండ్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సోమవారం ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌తో సహా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బీసీసీఐ అనుమతిస్తే విదేశీ లీగ్‌లు ఆడతానని వివరించారు. ఇక యువీ రిటైర్మెంట్‌పై ఇప్పటికే మాజీ, ప్రసుత క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి యువీ రిటైర్మెంట్‌పై ట్వీట్‌ చేశాడు. యువీతో కలిసి ఉన్న ఫోటోను జత చేసి పోస్ట్‌ చేశాడు.  

‘అభినందనలు పాజీ. దేశం తరుపున అద్భుతమైన క్రికెట్‌ ఆడావు. ఎన్నో అద్భుతమైన మధుర జ్ఞాపకాలతో పాటు గొప్ప విజయాలను మాకు అందించావు. నీకు ఆల్‌ ద బెస్ట్‌. నిజమైన, సంపూర్ణ విజేత’అంటూ కోహ్లి భావోద్వేగమైన ట్వీట్‌ చేశాడు. ఇక రిటైర్మెంట్‌ అనంతరం కేన్సర్‌ బాధితులకు తన వంతు సహాయం చేస్తానని యువీ ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ రిటైర్మెంట్‌తో క్రికెట్‌లో ఒక శకం ముగిసిందన పలువురు క్రికెటర్లు అభిప్రాయడుతున్నారు. ఇక యువీ సాధించిన విజయాలను, దేశానికి అతడు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎంతో మంది సోషల్‌ మీడియాలో సందేశాలు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు.

వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 14 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు నమోదు చేశాడు. రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్, ఐర్లాండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. 2000లో కెన్యాపై అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఈ సిక్సర్ల కింగ్‌.. చివరి వన్డేను 2017 వెస్టిండీస్‌తో ఆడాడు.  2003లో టెస్టుల్లో న్యూజిలాండ్‌తో అరంగేట్రం చేసిన యువీ 2012లో ఇంగ్లండ్‌పై తన చివరి టెస్ట్‌ను ఆడగా, ఇక చివరి అంతర్జాతీయ టీ20 ఇంగ్లండ్‌పై 2017లో ఆడాడు. ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు.

చదవండి: 
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్‌ సింగ్‌
క్రికెట్‌ ఎంత ఇష్టమో.. అంత అయిష్టం
 

మరిన్ని వార్తలు