‘టాప్‌’ ర్యాంక్‌లోనే విరాట్‌ కోహ్లి

2 Feb, 2020 04:12 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. బ్యాట్స్‌మెన్‌ విభాగంలో భారత కెప్టెన్‌ కోహ్లి 928 పాయింట్లతో నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతుండగా.... 17 పాయింట్లు తేడాతో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లలో చతేశ్వర్‌ పుజారా (6), అజింక్య రహనే (9) తమ స్థానాలను కాపాడుకున్నారు. మయాంక్‌ అగర్వాల్, రోహిత్‌ శర్మలు ఒక్కో స్థానాన్ని మెరుగుపర్చుకుని వరుసగా 12, 13వ స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్‌ విభాగంలో భారత ఏస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆరో స్థానంలో ఉండగా... స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎనిమిది, పేసర్‌ షమీ తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు