టూర్‌ మొత్తం భార్యలను అనుమతించండి: కోహ్లి

7 Oct, 2018 12:43 IST|Sakshi

ముంబై: విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల సతీమణులను అనుమతించాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బీసీసీఐని కోరాడు. అయితే బీసీసీఐ ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చాలని కోహ్లి తొలుత ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించగా.. అతను వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ)కి చెప్పారు. ఇందుకు సంబంధించిన అధికారిక అభ్యర్థనను టీమిండియా మేనేజర్‌ ద్వారా పంపాలని సీఓఏ తెలిపింది. అయితే దీనిపై సీఓఏ కొత్త బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

‘విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలనే అభ్యర్థన కొన్ని వారాల క్రితమే వచ్చింది. అయితే ఇది బీసీసీఐ విధాన నిర్ణయం కావున ఇందుకు సంబంధించి అధికారిక అభ్యర్థనను మేనేజర్‌  పంపాల్సి ఉంటుంది. కోహ్లితో కలిసి అనుష్క విదేశీ పర్యటనలకు వెళ్తోంది. అయితే పాత నిబంధనలను మార్చి టూర్‌ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని కోహ్లి కోరుతున్నాడు.’ అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. భార్యలను, గర్ల్‌ ఫ్రెండ్స్‌ను క్రికెటర్లతో అనుమతించడం వల్ల గతంలో చోటుచేసుకున్న సమస్యల నేపథ్యంలో చాలా దేశాలు తమ ఆటగాళ్ల వెంట భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లడంపై నిబంధనలు విధించాయి.

మరిన్ని వార్తలు