కౌంటీల్లో కోహ్లి ఆడటం లేదు: బీసీసీఐ

24 May, 2018 15:44 IST|Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. సర్రే తరఫున కౌంటీలు ఆడాల్సి ఉండగా.. మెడ గాయం కారణంగా కోహ్లి ఆడటం లేదని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఐపీఎల్‌లో భాగంగా బెంగళూరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి గాయపడినట్లు బోర్డు తెలిపింది. దీనిపై స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోహ్లికి సుదీర్ఘ విశ్రాంతి అవసరమని మెడికల్‌ టీమ్‌ చెప్పినట్లు బీసీసీఐ పేర్కొంది.

దీనిలో భాగంగా కౌంటీలు ఆడటానికి కోహ్లి వెళ్లడం లేదని వివరణ ఇచ్చింది. ‘ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్‌ పర్యవేక్షణలో  కోహ్లి చికిత్స పొందనున్నాడు. జూన్ 15న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోహ్లి ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొననున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు ముందు కోహ్లి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని బీసీసీఐ మెడికల్ టీమ్‌ విశ్వాసం వ్యక్తం చేసింది.

ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన వెంటనే ఇంగ్లిష్‌ కౌంటీలు ఆడేందుకు ఇంగ్లండ్‌కు పయనం కావాలని కోహ్లి ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు నెలలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో తన ప్రిపరేషన్‌లో భాగంగా అక్కడ కౌంటీల్లో ఆడేందుకు కోహ్లి మొగ్గుచూపాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నుంచి కూడా కోహ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అయితే తాజాగా గాయం కారణంగా కోహ్లి కౌంటీలకు దూరం కావాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు