హ్యాట్సాఫ్‌ ధోని : కోహ్లి

15 Jan, 2019 19:02 IST|Sakshi

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం క్రెడిట్‌ మాత్రం సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనిదేనని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. అద్భుతంగా రాణించిన ఈ రోజు ధోనికి ప్రత్యేకమని, హ్యాట్సాఫ్‌ అంటూ కితాబిచ్చాడు.

‘ధోనికి ఈ రోజు చిరస్మరణీయమైనది. మ్యాచ్‌పై అతని లెక్కలు అసాధారణం. నాకు మద్దతుగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనికి హ్యాట్సాఫ్. సరైన సమయంలో తన సత్తా ఏంటో చూపించాడు. విజయం కోసం అందరం కష్టపడ్డాం. ఇది మాకు ప్రత్యేకమైన దినం. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో మేం ఆసీస్‌ను కట్టడి చేశాం. మ్యాక్స్‌వెల్‌, మార్ష్‌ల వికెట్లు పడగొట్టిన ఆ రెండు బంతులు అద్భుతం. బంతితో భువీ చాలా బాగా రాణించాడు. అతను ఫామ్‌లోకి వచ్చి మాకు అండగా నిలిచాడు. చివర్లో ధోని-కార్తీక్‌లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్‌ బాగా రాణించాడు. ఈ రోజు మాకు చాలా కఠినంగా గడిచింది. ఉక్కపోతతో మా దుస్తులు ఉప్పుతో నిండిపోయాయి. తీవ్రంగా అలసిపోయాం. విరామాన్ని ఆస్వాదించి చివరి మ్యాచ్‌కు సిద్ధమవుతాం’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ధోని (55 నాటౌట్‌)  హాఫ్‌ సెంచరీతో భారత్‌కు విజయాన్నందించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు