ఓడినా అసలు మజా లభించింది: కోహ్లి

12 Sep, 2018 08:34 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

లండన్‌ : ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయినా అసలు సిసలు టెస్ట్‌ క్రికెట్‌ మజా లభించిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. చివరి టెస్ట్‌లో విజయంపై ఆశలు రేపినా భారత్‌కు 118 పరుగుల అపజయమే లభించింది. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌ ఇంగ్లండ్‌ 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ..‘ఇంగ్లండ్‌ మా కంటే మెరుగ్గా రాణించింది. లార్డ్స్‌ టెస్ట్‌ మినహా మేం మిగతా మ్యాచ్‌లు బాగానే ఆడాం. మాకు లభించిన అవకాశాలను అందుకోలేకపోయాం. ఓడినా ఈ సిరీస్‌ హోరాహోరిగా సాగింది. అసలైన టెస్ట్‌ క్రికెట్‌ మజాను ఈ సిరీస్‌ అందించింది. రాహుల్‌, పంత్‌ల బ్యాటింగ్‌ అద్భుతం. పంత్‌ పోరాటపటిమ ఆకట్టుకుంది. అతనిపై మాకు నమ్మకం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌ భవిష్యత్తు. సామ్‌ కరణ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు అర్హుడు. తొలి, నాలుగో టెస్ట్‌లో అతను ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కష్ట సమయాల్లో తన జట్టును ఆదుకున్నాడు. ఇరు జట్లు విజయం కోసం పోటీపడటంతో అభిమానుల మ్యాచ్‌ చూసేందుకు వచ్చారు.’ అని తెలిపాడు.( చదవండి: టీమిండియాపై కుక్‌ అరుదైన ఫీట్‌)

ఇక ఈ మ్యాచ్‌తో ఘనంగా అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ గురించి కోహ్లి మాట్లాడుతూ.. అతని కెరీర్‌ గొప్పగా సాగింది. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (224 బంతుల్లో 149; 20 ఫోర్లు, 1 సిక్స్‌), వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (146 బంతుల్లో 114; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన, అద్భుత శతకాలతో విజయంపై ఆశలు రేకెత్తాయి. కానీ కీలక సమయంలో ఆదిల్‌ రషీద్‌ (2/63) చక్కటి బంతితో రాహుల్‌ను ఔట్‌ చేసి భారత్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ వెంటనే పంత్‌నూ సైతం పెవిలియన్‌ పంపి ఆతిథ్య జట్టు విజయానికి ఊపిరి పోశాడు.17 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ 345 పరుగులకు ఆలౌటై 118 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో మెరిసిన కోహ్లి కెప్టెన్సీ విఫలమయ్యాడని, తుది జట్టు ఎంపిక చేయడంలో తడబడ్డాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి: ఆశలు రేపి...  ఆవిరి చేసి! 

మరిన్ని వార్తలు