రోహిత్‌ గొప్ప వన్డే ఆటగాడు : కోహ్లి

3 Jul, 2019 09:24 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ

బర్మింగ్‌హామ్‌ : టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గొప్ప వన్డే ఆటగాడని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కొనియాడాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ శతక్కొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. రోహిత్‌ అద్భుత ఇ‍న్నింగ్స్‌ను కొనియాడాడు. (చదవండి: విజయం అదిరె...)

‘కొన్నేళ్లుగా రోహిత్‌ ఆటను చూస్తున్నాను. ప్రపంచంలోనే అతనో గొప్ప వన్డే బ్యాట్స్‌మన్‌. ఇలానే ఆడితే అతని ఆటను ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు. బుమ్రా బౌలింగ్‌ ఎప్పుడూ కఠినమే. అందుకే అతని ఓవర్లను మేం కాపాడుకుంటాం. అతను ప్రపంచశ్రేణి బౌలర్‌. ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలో అతనికి బాగా తెలుసు. బంగ్లాదేశ్‌ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆఖరి బంతి వరకు వారు పోరాడారు. మేం సెమీస్‌కు చేరడం ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహాన్ని సెమీఫైనల్స్‌లో కొనసాగిస్తాం. ఐదుగురు బౌలర్లు బరిలోకి దించడం కష్టమైన పనే. కానీ మైదానం కొలతలు బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. చిన్నబౌండరీలున్నప్పుడు సరైన కూర్పుతో బరిలోకి దిగాలని మేం భావిస్తున్నాం. పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ మరిన్ని పరుగులు చేయడంపై దృష్టిసారిస్తాం. ప్రస్తుతం జట్టు ప్రదర్శనపట్ల సంతోషంగా ఉంది. అభిమానుల మద్దతు కూడా అద్భుతం.’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు