మావాళ్లు ఆకలిమీదున్నారు : కోహ్లి

23 Jun, 2019 09:12 IST|Sakshi

సౌతాంప్టన్‌ : భారత ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తెలిపాడు. అఫ్గానిస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలుపు కోసం తీవ్రంగా పోరాడిన అప్గాన్‌ను దెబ్బతీసిన యార్కర్ల కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రా, హ్యాట్రిక్‌ హీరో మహ్మద్‌ షమీలను కోహ్లి కొనియాడాడు. ఈ మ్యాచ్‌ అనంతరం మట్లాడుతూ.. ‘జట్టులో ప్రతి ఒక్కరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. షమీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇతర బౌలర్ల కన్నా బంతిని బాగా తిప్పాడు. విజయ్‌ ఫీల్డింగ్‌ అద్భుతం. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆకలి మీదున్నారని మాకు తెలుసు. ఈ మ్యాచ్‌ గెలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తర్వాత అనూహ్యంగా పిచ్‌ సహకరించలేదు. కనీసం 260 నుంచి 270 లక్ష్యాన్నైనా నిర్ధేశిస్తాం అనుకున్నాం. కానీ ఆట మధ్యలో పిచ్‌ మరి ప్రతికూలంగా మారింది. పిచ్‌ స్వభావాన్ని అర్థం చేసుకున్నాను. క్రాస్‌ షాట్స్‌ ఆడవద్దని గ్రహించాను. ముగ్గరు మణికట్టు స్పిన్నర్లు ఎదుర్కోవడం కష్టమైన పనే. పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా బుమ్రానే మా అస్త్రంగా ఎంచుకున్నాం. అతను ఒక్క వికెట్‌ తీసినా చెలరేగుతాడు. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించాం’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

ఇక పసికూనగా భావించిన అఫ్గాన్‌ కోహ్లిసేనకు పరీక్షగా నిలిచింది. ఛేదనలో బలమైన బౌలింగ్‌ను తట్టుకుంటూ కోహ్లి సేనకు ఈ ప్రపంచ కప్‌లో తొలి ఓటమి రుచి చూపించేలా కనిపించింది. కానీ, బుమ్రా, షమీ పేస్‌తో పడగొట్టడంతో పోరాడి ఓడామన్న సంతృప్తి మిగుల్చుకుంది. 
చదవండి: భారత్‌ అజేయభేరి

మరిన్ని వార్తలు