అందుకే ఓడాం : కోహ్లి

25 Feb, 2019 08:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : గత కొద్ది రోజులుగా విజయాలతో దూసుకుపోతున్న భారత్‌కు సొంతగడ్డపై గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాగరతీరాన ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 3 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందన్నాడు. ‘బౌలర్ల పోరాటం చూస్తే చాలా గర్వంగా ఉంది. మేం ఈ మ్యాచ్‌ను ఇంత వరకు లాక్కొస్తామని అస్సలు ఊహించలేదు. బుమ్రా అద్భుతం చేశాడు. మయాంక్‌ కూడా బాగా బౌలింగ్‌ చేశాడు. తొలి మ్యాచ్‌ను అందిపుచ్చుకోలేకపోయాం. 15వ ఓవర్‌ వరకు పిచ్‌ బ్యాటింగ్‌కు ఏ మాత్రం సహకరించలేదు. మేం బ్యాటింగ్‌లో వైఫల్యం చెందాం. టీ20ల్లో తక్కువ స్కోర్లతో నెగ్గడం చాలా కష్టం. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా రాహుల్‌, పంత్‌లకు అవకాశం కల్పించాం. రాహుల్‌ అద్భుతంగా ఆడాడు. అతడితో నేను మంచి భాగస్వామ్యం కూడా నెలకొల్పా. ఈ పిచ్‌పై 150 పరుగులు చేసుంటే గెలిచేవాళ్లం. మా కంటే అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆసీస్‌ ఆటగాళ్లు ఈ విజయానికి అర్హులు.’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. (చదవండి: గెలుపు గోవిందా)

చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ చివరకు ఆసీస్‌ వశమైంది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లో రాహుల్‌ (36 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా... ధోని (37 బంతుల్లో 29 నాటౌట్‌; 1 సిక్స్‌), కోహ్లి (17 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం.. వేగంగా ఆడకపోవడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. ( చదవండి: వివాదానికి ముందు... వివాదానికి తరువాత...)

మరిన్ని వార్తలు