కోహ్లికి గోమూత్రంతో స్నానం చేయించండి..!

9 Jun, 2019 12:34 IST|Sakshi

న్యూఢిల్లీ : భారతీయుల విశ్వాసాలు కొన్ని వింతగా.. విడ్డూరంగా ఉంటాయి. మరికొన్ని మూఢంగా ఉంటాయి. ఇక ఆటలో టీమిండియా విజయం సాధించాలని, తమ అభిమాన ఆటగాళ్లు సెంచరీలు బాదాలని కొందరు గుళ్లు, గోపురాలూ తిరుగుతారు. అభిషేకాలు, అర్చనలు చేస్తారు. మరికొందరు వీరాభిమానులు గుళ్లే నిర్మిస్తారు. తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యంలో మన జట్టు ప్రపంచకప్‌ సాధించాలని ఢిల్లీలో అతను విద్యనభ్యసించిన విశాల్‌ భారతి పబ్లిక్‌ స్కూల్‌ అలాంటి పనే చేసింది. ‘కోహ్లి క్రికెట్‌ పాఠాలు నేర్చిన మట్టి’ని లండన్‌ పంపించింది. టీమిండియా కెప్టెన్‌ను ఆశీర్వదించేందుకు ఉత్తమ్‌నగర్‌లోని అతని పూర్వ పాఠశాల మట్టిని పంపిందంటూ స్టార్‌ స్పోర్ట్స్‌ ట్వీట్‌ చేసింది. మీరు కూడా కోహ్లిని ఆశీర్వదించండని కోరింది.
(అసలు సిసలు సమరం)

దీనిని నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్‌ చేస్తున్నారు. ఎవరు బాబు ఈ అద్భుతమైన ఐడీయా ఇచ్చిందని అంటున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్‌ అవసరమా అని చురకలంటిస్తున్నారు. మట్టి పంపుతున్నారు సరే.. మరి ఆ స్కూల్‌ పరిసరాల్లో ఉన్న గాలి కూడా పంపండని ఎద్దేవా చేస్తున్నారు. ‘మట్టితో పాటు గోమూత్రాన్ని కూడా పంపండి. దాంతో స్నానం చేస్తే కోహ్లికి అతీతమైన శక్తులు వస్తాయి. అప్పుడు ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే అతను పరుగుల వరద పారిస్తాడు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక గత బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిమ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓవల్‌లో టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆట ప్రారంభం అవనుంది.

మరిన్ని వార్తలు