దాదా కెప్టెన్సీ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి

5 Feb, 2020 18:06 IST|Sakshi

హామిల్టన్‌ : రికార్డులను బద్దలు కొట్టడం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి కొత్తేం కాదు.ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.  తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన 51 పరుగుల ద్వారా టీమిండియా సారధిగా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని వెనెక్కి నెట్టాడు. కెప్టెన్‌గా గంగూలీ మొత్తం 142 ఇన్నింగ్సుల్లో 5082 పరుగులు చేయగా, విరాట్‌ కేవలం 83 ఇన్నింగ్స్‌ల్లోనే 5123 పరుగులు చేసి దాదాను అధిగమించాడు. కాగా టీమిండియా నుంచి మొదటి స్థానంలో ఎంఎస్‌ ధోని 6,641 పరుగులు(172 ఇన్నింగ్స్‌) ఉండగా, రెండో స్థానంలో  మహ్మద్‌ అజారుద్దీన్‌ 5239 పరుగులు(162 ఇన్నింగ్స్‌)లతో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి ఆటతీరు చూస్తుంటే త్వరలోనే అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే మహీని అధిగమించడం ఖాయంగా కనపడుతుంది.(కోహ్లి మళ్లీ మలుపు తిప్పాడు..!)

ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో విరాట్‌ 7వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. తర్వాత ఎంఎస్‌ ధోని, స్టీఫెన్‌ ప్లెమింగ్‌, అర్జున రణతుంగ, గ్రేమి స్మిత్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌లు ఉన్నారు. అయితే వీరిలో ధోని తప్ప మిగతావారు అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో రిటైర్మెంట్‌ ప్రకటించారు. దీంతో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగానిగా కోహ్లి త్వరలోనే రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్‌ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. టీమిండియా విధించిన 347 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 11 బంతులు ఉండగానే విజయం సాధించింది.
(కోహ్లి మెరుపు ఫీల్డింగ్‌.. మున్రో బ్యాడ్‌ లక్‌)

మరిన్ని వార్తలు