కోహ్లికి హైదరాబాదీ విందు

8 May, 2018 01:02 IST|Sakshi
విందు సందర్భంగా బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో సిరాజ్, అతని సోదరుడు ఇస్మాయిల్‌

భారత కెప్టెన్‌కు అమోఘ రుచులందించిన సిరాజ్‌  

సాక్షి, హైదరాబాద్‌: భారత కెప్టెన్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి విరాట్‌ కోహ్లికి హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ అపూర్వ ఆతిథ్యమిచ్చాడు. తమ రాయల్‌ చాలెంజర్స్‌ సహచరులకు సిరాజ్‌ తన సొంతింట్లో విందు ఏర్పాటు చేశాడు. కోహ్లితో పాటు పార్థివ్, మన్‌దీప్, చహల్, వాషింగ్టన్‌ సుందర్, బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా తదితరులు ఆదివారం ప్రాక్టీసు ముగిశాక రాత్రి నగరంలోని టోలిచౌకీలో గల సిరాజ్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ హైదరాబాద్‌ బిర్యానీతో పాటు స్థానిక వంటకాల్ని వారి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయించాడు సిరాజ్‌.

విరాట్‌కు లేత మేక మాంసం, ఖోర్మాలతో పాటు తియ్యతియ్యని ఖుబానీ కా మీఠా, డబుల్‌ కా మీఠా  కొసరి కొసరి వడ్డించారు సిరాజ్‌ కుటుంబ సభ్యులు. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్, భారత కెప్టెన్‌ అయిన కోహ్లి... జాతీయ జట్టులో ఇంకా సుస్థిర స్థానంలేని క్రికెటర్‌ ఆహ్వానాన్ని మన్నించి ఆత్మీయ విందుకు రావడంపట్ల సిరాజ్‌తో పాటు అతని కుటుంబసభ్యులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.   
 

మరిన్ని వార్తలు