కోహ్లినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

26 Jun, 2017 16:05 IST|Sakshi
కోహ్లినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

హమిర్పూర్:భారత క్రికెట్ కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే వైదొలగడానికి కెప్టెన్ విరాట్ కోహ్లినే అనడం ఎంతమాత్రం సరికాదని అంటున్నారు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్. ఈ ఉదంతంలో కోహ్లినే  టార్గెట్ చేస్తూ ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు.

 

'అనిల్ కుంబ్లే కోచ్ గా తప్పుకున్న తరువాత విరాట్ కోహ్లిని ఎటువంటి కారణం లేకుండా టార్గెట్ చేశారు. కుంబ్లే వైదొలగడానికి విరాట్ అనే చర్చను ఇకనైనా ఆపితే మంచిది. వచ్చే 10 ఏళ్లలో భారత్ క్రికెట్ ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సత్తా కోహ్లికి ఉంది. ప్రస్తుతం అనవసరంగా కోహ్లిని బలపశువుని చేయడానికి యత్నిస్తున్నారు. భారత్ క్రికెట్ లో ఇలా జరగడం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా చాలాసార్లు కెప్టెన్లు, మాజీ కెప్టెన్లు బలైపోయారు. ఇప్పుడు విరాట్ కోహ్లి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రస్తుత క్రికెట్ బోర్డు పెద్దలు సమాధానం చెప్పాల్సి ఉంది' అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ తరహా వివాదాల్ని అంతకుముందు క్రికెట్ బోర్డు చాలా చాక్యంగా పరిష్కరించిందని అనురాగ్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత జట్టులో ఏమైనా సమస్యలున్నా అవి ఎప్పుడూ బయటకు లీక్ కాలేదన్నారు.

మరిన్ని వార్తలు