దెబ్బతిన్న కోహ్లి మైనపు విగ్రహం

8 Jun, 2018 12:32 IST|Sakshi

ఢిల్లీ:  ఇటీవల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లి మైనపు విగ్రహం దేశ రాజధాని ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మైనపు విగ్రహం కాస్త దెబ్బ తింది. కోహ్లి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో మైనపు విగ్రహం కుడి చెవి పైభాగం పాక్షికంగా దెబ్బతింది.

దీన్ని గమనించిన మ్యూజియం నిర్వాహకులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. విగ్రహపు చెవి భాగానికి సంబంధించిన కొలతలను నిపుణులకు పంపించారు. త్వరలోనే కోహ్లి విగ్రహానికి మళ్లీ యధారూపం తీసుకు రానున్నారు. దెబ్బతిన్న కోహ్లిమైనపు విగ్రహం ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన మూడో భారత క్రికెటర్‌ విగ్రహం కోహ్లిది. అంతకుముందు కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు