సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల్లో కోహ్లీకి క్రేజ్ మామూలు రేంజ్లో ఉండదు. ఎంత అంటే డానియెల్లి యాట్ సైతం విరాట్ను పెళ్లి చేసుకోమని కోరింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఈసారి పాకిస్తాన్ నుంచి వచ్చింది. పాకిస్తాన్కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇటీవల ప్రపంచ ఎలెవన్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్లో తనను పెళ్లి చేసుకోమని ఓ పోస్టర్ పట్టుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియా ట్విట్టర్లో వైరల్ అయింది.
ఇక ఇటీవల పాకిస్తాన్లో ప్రపంచ ఎలెవన్ క్రికెట్ జట్టు పర్యటించింది. ఇందులో ప్రపంచ దేశాలకు చెందిన క్రికెటర్లు పాల్గొన్నారు. అయితే ఇందులో భారత్ నుంచి ఏఒక్కరు ఆడలేదు. దీంతో పాక్లోని కోహ్లీ, ధోని అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. సోషల్ మీడియా ద్వారా తమ నిరాశను వ్యక్త పరిచారు. భారత ఆటగాళ్లు కోహ్లీ, ధోని ఈ మ్యాచ్ల్లో ఆడుంటే పాకిస్తాన్ క్రికెట్కు మరింత ప్రభావం ఉండేదన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో చాలా మంది అభిమానులు 'వీ మిస్ ధోని, కోహ్లీ' అనే ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. అందులో ఒకరు 'కోహ్లి మేరీ మీ' ప్లకార్డు పట్టుకొని ఉన్నాడు.