తనపై తానే సెటైర్‌ వేసుకున్న సెహ్వాగ్‌

12 Aug, 2019 16:30 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో భారత మాజీ క్రికెటర్‌  వీరేంద్ర సెహ్వాగ్‌ ఒకడు. అవకాశం వచ్చినప్పుడూ విభిన్న శైలిలో ట్వీట్లు చేస్తూ ఆకట్టుకుంటాడు సెహ్వాగ్‌. అయితే తనపై తానే సెటైర్‌ వేసుకునే సందర్భం వచ్చిందనుకున్నాడేమో, ఇప్పుడు అదే చేశాడు వీరు భాయ్‌. ఇక్కడ ఎనిమిదేళ్ల క్రితం భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన సెహ్వాగ్‌..  బర్మింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టులో తాను రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటైన విషయాన్ని మరోసారి పేర్కొంటూ ‘ నేను కింగ్‌ పెయిర్‌ స్కోరు’ చేశానంటూ ఎద్దేవా చేసుకున్నాడు.

‘సరిగ్గా ఇదే రోజు(ఆగస్టు 12వ తేదీన) నేను కింగ్‌ పెయిర్‌ స్కోరు చేశా. ఈ ఘనత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టకే దక్కుతుంది.  మనం ఫెయిల్యూర్‌ కావడానికి జీరో చాన్స్‌ మాత్రమే ఉంటే ఇంకేమి చేస్తాం’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లో ఒక బ్యాట్స్‌మన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరితే కింగ్‌ పెయిర్‌గా పిలుస్తాం. ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకున్న సెహ్వాగ్‌.. తనపై తానే సెటైర్‌ వేసుకుని మరీ అభిమానుల్ని మరోసారి ఆకట్టుకునే యత్నం చేశాడు.  ఆ టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ 4-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులకు దూరమైన మూడో టెస్టులో ఆడి రెండు ఇన్నింగ్స్‌ల్లో ‘సున్నా’లకే ఔటయ్యాడు.

మరిన్ని వార్తలు