ఆనంద్‌కు కాంస్యం 

31 Dec, 2017 01:11 IST|Sakshi

రియాద్‌: భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈ ఏడాదిని గొప్పగా ముగించాడు. మూడు రోజుల క్రితం ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆనంద్‌... అదే వేదికపై జరిగిన ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో 48 ఏళ్ల ఆనంద్‌ నిర్ణీత 21 రౌండ్‌లు పూర్తయ్యాక 14.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్‌ (రష్యా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా కర్జాకిన్‌కు రెండో స్థానం, ఆనంద్‌కు మూడో స్థానం లభించాయి.  ఒక్కొక్కటి మూడు నిమిషాల నిడివిగల 21 గేముల్లో ఆనంద్‌ తొమ్మిదింటిలో గెలిచి... 11 ‘డ్రా’ చేసుకున్నాడు. మరో గేమ్‌లో ఓడిపోయాడు. 16 పాయింట్లతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) టైటిల్‌ సాధించాడు.    

మరిన్ని వార్తలు