ఆనంద్‌కు పరీక్ష

12 Mar, 2014 01:28 IST|Sakshi

నేటి నుంచి క్యాండిడేట్స్ చెస్ టోర్నీ
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): స్వదేశంలో గతేడాది కోల్పోయిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కిరీటాన్ని ఈసారి దక్కించుకునే క్రమంలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి పరీక్షకు సిద్ధమయ్యాడు. బుధవారం మొదలయ్యే క్యాండిడేట్స్ టోర్నమెంట్ ద్వారా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్  కార్ల్‌సన్ (నార్వే)తో తలపడే ప్రత్యర్థి ఎవరో నిర్ణయిస్తారు.
 
 ఈనెల 31 వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్స్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడనున్నారు. ఆనంద్‌తోపాటు వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), దిమిత్రీ ఆంద్రికిన్ (రష్యా), వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్‌బైజాన్), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా), పీటర్ స్విద్లెర్ (రష్యా) బరిలో ఉన్నారు.
 
 
  విజేతగా నిలిచిన వారు ఈ ఏడాది చివర్లో కార్ల్‌సన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పోటీపడతారు. బుధవారం ప్రారంభోత్సవం జరుగుతుంది. గురువారం జరిగే తొలి రౌండ్‌లో అరోనియన్‌తో ఆనంద్; తొపలోవ్‌తో మమెదైరోవ్; కర్జాకిన్‌తో స్విద్లెర్; క్రామ్నిక్‌తో ఆంద్రికిన్ ఆడతారు. 6 లక్షల యూరోల (రూ. 5 కోట్ల 6 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజేతకు 1,35,000 యూరోలు (రూ. కోటీ 14 లక్షలు) లభిస్తాయి.
 

మరిన్ని వార్తలు