హెచ్‌సీఏ సలహా కమిటీలో లక్ష్మణ్‌

18 Apr, 2017 00:41 IST|Sakshi
హెచ్‌సీఏ సలహా కమిటీలో లక్ష్మణ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో కొత్తగా క్రికెట్‌ సలహా కమిటీ ఏర్పాటైంది. ఈనెల 12న జరిగిన హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దిగ్గజ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, మాజీ స్పిన్నర్‌ వెంకటపతిరాజు, భారత మహిళా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ పూర్ణిమా రావు ఇందులో సభ్యులుగా ఉంటారని హెచ్‌సీఏ పేర్కొంది. తమ విజ్ఞప్తిని అంగీకరించిన వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు హెచ్‌సీఏ కార్యదర్శి టి.శేష్‌ నారాయణ్‌ తెలిపారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అభ్యున్నతికి ఈ కమిటీ సభ్యులు అపెక్స్‌ కౌన్సిల్‌కు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

‘కమిటీలో భాగం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్‌ క్రికెట్‌ భవిష్యత్‌ మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుంది’ అని లక్ష్మణ్‌ అన్నారు. క్రికెట్‌ వ్యవహారాల కోసం ఇటీవల ఏర్పడిన అపెక్స్‌ కౌన్సిల్‌కు సహాయంగా ఉండేందుకు తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు వెంకటపతి రాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ మహిళా క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమని పూర్ణిమా రావు అన్నారు. తెలంగాణలో మహిళా క్రికెట్‌ అభివృద్ధికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు