భారత్‌ ఓటమి.. పాకిస్థాన్‌కు మంటెందుకు!

1 Jul, 2019 15:33 IST|Sakshi

టీమిండియా క్రీడానీతిని పాటించలేదంటూ పాక్‌ ఆటగాళ్ల విమర్శలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ తొలి పరాజయాన్ని చవిచూడటం.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలు కావడంతో దాయాది పాకిస్థాన్‌ చిరాకు పడుతోంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. పాక్‌ ఆటగాళ్లు మాత్రం ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓటమికి వక్రభాష్యాలు చెబుతున్నారు. టీమిండియాకు క్రీడానీతి లేదంటూ పరోక్షంగా వేలెత్తి చూపుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. తాజా మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించడంతో సర్ఫరాజ్‌ అహ్మద్‌ సేన సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లాయి. అదే ఇంగ్లండ్‌ను భారత్‌ ఓడించి ఉంటే.. పాక్‌ సెమీస్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉండేవి. కానీ, ఇంగ్లండ్‌ గెలువడంతో ఇప్పుడు ఆ జట్టు బంగ్లాదేశ్‌పై గెలుపొందినా.. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోతే.. పాక్‌ సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ బంగ్లా చేతిలో పాక్‌ ఓడిపోతే.. ఇంగ్లండ్‌కు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పాక్‌, భారత్‌ మీద బంగ్లా గెలుపొంది.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోతే.. బంగ్లాదేశ్‌ సెమీస్‌కు చేరే అవకాశముంటుంది. 

ఈ సమీకరణాలు ఎలా ఉన్నా నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్‌ పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో భారత్‌ చివర్లో తడబడి.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 306 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌ నేపథ్యంలో టీమిండియా క్రీడానీతిని చాటడంలో దారుణంగా విఫలమైందంటూ పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ వకార్‌ యూనిస్‌ ట్విటర్‌లో విమర్శించారు. ‘నువ్వు ఎవరన్నది కాదు..  ఏం చేశావన్నదే నీ జీవితాన్ని నిర్వచిస్తుంది. పాక్‌ సెమీస్‌కు వెళ్లినా.. వెళ్లకపోయినా నాకేమీ బాధ లేదు కానీ, ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఇద్దరు చాంపియన్ల క్రీడానీతిని పరీక్షించగా.. వాళ్లు దారుణంగా విఫలమయ్యారు’ అంటూ భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.   

>
మరిన్ని వార్తలు