దశాబ్దంలో ‘ఒక్కటి’ కూడా గెలవలేదు..!

27 Feb, 2020 13:50 IST|Sakshi

కేప్‌టౌన్‌: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా కోల్పోయింది. ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో కేవలం మ్యాచ్‌ మాత్రమే గెలిచిన సఫారీలు.. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై సిరీస్‌ను సమర్పించుకున్నారు. బుధవారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక​ మ్యాచ్‌లో ఆసీస్‌ 97 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దాంతో ఆసీస్‌ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టీ20లో ఆసీస్‌ గెలిస్తే, రెండో టీ20లో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దాంతో చివరి టీ20పై ఆసక్తి ఏర్పడింది. (ఇక్కడ చదవండి: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా మరోసారి వార్నర్‌)

అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(57;37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అరోన్‌ ఫించ్‌(55; 37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మంచి ఆరంభాన్ని అందించారు. అనంతరం మాథ్యూ వేడ్‌(10), మిచెల్‌ మార్ష్‌(19)లు నిరాపరిచినా, స్టీవ్‌ స్మిత్‌(30 నాటౌట్‌;15 బంతుల్లో 2 సిక్స్‌)లు ఆకట్టుకున్నాడు. దాంతో ఆసీస్‌ 194 పరుగుల టార్గెట్‌ను  నిర్దేశించింది. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు తీవ్రంగా విఫలమైంది. డీకాక్‌(5), డుప్లెసిస్‌(5)లు నిరాశపరిచారు. వాన్‌ డర్‌ డస్సెన్‌(24), హెన్రిచ్‌ క్లాసెన్‌(22), డేవిడ్‌ మిల్లర్‌(15), ప్రిటిరియోస్‌(11)లు మాత్రమే రెండంకెల స్కోరుగా చేయగా మిగతా వారు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.  మిచెల్‌ స్టార్క్‌, ఆస్టన్‌ ఆగర్‌ల దెబ్బకు దక్షిణాఫ్రికా 15.3 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని చవిచూసింది. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లోకి..)

 ‘ఒక్కటి’ కూడా గెలవలేదు..!
గత 10 ఏళ్ల నుంచి చూస్తే ఆసీస్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ల్లో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఒక్కటి కూడా సాధించలేకపోయింది. 2011లో ఆసీస్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను డ్రా చేసుకున్న సఫారీలు.. 2014లో రెండు టీ20ల సిరీస్‌ను 0-2తో ఆసీస్‌కు సమర్పించుకున్నారు. అనంతరం 2016లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్‌ 2-1తో కైవసం​ చేసుకోగా, తాజా సిరీస్‌లో అదే ఫలితం రిపీట్‌ అయ్యింది. తద్వార గత 10 ఏళ్లలో ఆసీస్‌ జరిగిన టీ20 సిరీస్‌ల్లో సఫారీలు తమ సొంత గడ్డపై ఒక్కటి కూడా కైవసం చేసుకోలేపోయారు. 

ఇదే అత్యల్ప స్కోరు
కేప్‌టౌన్‌లో న్యూలాండ్స్‌ మైదానంలో జరిగిన టీ20ల పరంగా చూస్తే ఇది అత్యల్ప స్కోరుగా నమోదైంది. గతంలో శ్రీలంక చేసిన 101 పరుగులు ఇప్పటివరకూ ఇక్కడ అత్యల్ప స్కోరు కాగా, దాన్ని దక్షిణాఫ్రికా బ్రేక్‌ చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది.  టీ20ల్లో ఆసీస్‌కు ఇది నాల్గో అతి పెద్ద విజయంగా నమోదైంది. 2019లో శ్రీలంకతో జరిగిన టీ20లో ఆసీస్‌ 134 పరుగుల తేడాతో విజయం సాధించగా,  ఈ  సిరీస్‌లో తొలి టీ20 ఆసీస్‌ 107 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆ తర్వాత స్థానంలో 2018లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 100 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. 

మరిన్ని వార్తలు