'మ్యాచ్ ముందు రోజు నిద్రపోలేదు'

21 Jun, 2016 14:18 IST|Sakshi
'మ్యాచ్ ముందు రోజు నిద్రపోలేదు'

హరారే: జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్ ఆడడానికి ముందు రోజు రాత్రి నిద్రపోలేదని టీమిండియా యువ బ్యాట్స్ మన్ మన్దీప్ సింగ్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు చాలా ఒత్తిడికి గురైనట్టు వెల్లడించాడు. అయితే బ్యాటింగ్ కు దిగిన తర్వాత తనపై ఒత్తిడి మాయం అయిందన్నాడు. సోమవారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో మన్దీప్ అర్ధసెంచరీ(52)తో రాణించాడు.

'మ్యాచ్ ఆడడానికి ముందు నిద్రలేని రాత్రి గడిపా. మ్యాచ్ గెలుస్తామా, సిరీస్ దక్కించుకుంటామా అనేదే మదిలో మెదిలింది. నా ఆటను సెలక్టర్లు గమనిస్తున్నారన్న విషయం పదేపదే గుర్తుకు వచ్చింది. బ్యాటింగ్ కు దిగడానికి ముందు కూడా ఒత్తిడి గురయ్యాను. బ్యాటింగ్ ప్రారంభించాక ఒత్తిడి దూదిపింజలా ఎగిరిపోయింది. మ్యాచ్ గెలవాలన్న లక్ష్యం తప్ప మరో ఆలోచన రాలేద'ని మన్దీప్ తెలిపాడు. మొదటి మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం బాధ కలిగించిందన్నాడు. పరాజయం తర్వాత తప్పులను సమీక్షించుకుని రెండో మ్యాచ్ లో బరిలోకి దిగామని మన్దీప్ వెల్లడించాడు. 

>
మరిన్ని వార్తలు