‘భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచే‌.. యుద్దం కాదు’

15 Jun, 2019 08:58 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, సర్ఫరాజ్‌ అహ్మద్‌

పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌

ఇస్లామాబాద్‌ : యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఇరు దేశాల అభిమానులు మైదానంలో జరుగుతున్న ఓ యుద్ధంలా చూస్తారు. ఇక అది ప్రపంచకప్‌ మ్యాచ్‌ అయితే టీవీలకే అతుక్కుపోతారు. తామే మైదానంలో యుద్దం చేస్తున్నట్లు ఫీలవుతారు. ప్రతికూల ఫలితాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. తమ దేశం గెలవాలంటే తమ దేశం గెలవాలని కోరుకుంటారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఈ దాయాదుల పోరు జరగనున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ సరిహద్దుల్లో ఇంకా కాల్పుల మోత మోగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న మ్యాచ్‌ను ఇరు దేశాల అభిమానులు, ఆటగాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అయితే భారత్‌-పాక్‌ మధ్య జరిగేది క్రికెట్‌ మ్యాచేనని, యుద్ధం కాదని.. అభిమానులు ప్రశాంతంగా ఉండాలని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ విజ్ఞప్తి చేస్తున్నాడు. (చదవండి: పాక్‌ మీకు కావాల్సిన కప్‌ ఇదే: పూనమ్‌ ఫైర్‌)

‘ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అభిమానులు ఈ మ్యాచ్‌ చాలా పెద్దదిగా చూస్తారు. కాబట్టి ఇరు జట్ల అభిమానులను నేను కోరేది ఒక్కటే.. మ్యాచ్‌ అన్నప్పుడు ఒక జట్టు ఓడి మరో జట్టు గెలవడం సర్వసాధారణం. కావున దీన్ని ఓ యుద్దంలా భావించవద్దు. అలా ఎవరూ పరగణిస్తారో వారు నిజమైన క్రికెట్‌ అభిమానులు కాదు.’ అని వసీం పేర్కొన్నాడు. అయితే ప్రపంచకప్‌ చరిత్రలో పాక్‌, భారత్‌ను ఇంత వరకు ఓండిచలేకపోయింది. కానీ ఆదివారం పాక్‌ ఈ రికార్డు తిరగరాస్తుందని వసీం ఆశాభావం వ్యక్తం చేశాడు. 1992, 1999, 2003 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ చేతిలో ఓడిన పాక్‌ జట్టులో వసీం అక్రమ్‌ కూడా సభ్యుడే. ‘ అవును. భారత్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఓడాం. వాటి నేను గుర్తుచేసుకోవాలనుకోవడం లేదు. కానీ అభిమానులు ఎక్కడ ఉన్నా టీవీలకు అతుక్కుపోవడం వంటి నాటి పరిస్థితులను బాగా ఆస్వాదించాను. ఆదివారం కూడా ఇవే పరిస్థితులు పునరావృతం కానున్నాయి.’ అని వసీం  చెప్పుకొచ్చాడు. ఇక భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉండదని, అభిమానులు పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి : ‘ఆ ఫైనల్‌ ఫలితాన్ని రిపీట్‌ చేద్దాం’)

మరిన్ని వార్తలు