‘ఈజీగా 80 సెంచరీలు కొట్టేస్తాడు’

12 Aug, 2019 21:51 IST|Sakshi

ముంబై : టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిపై మాజీ టెస్టు బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సెంచరీ సాధించిన అనంతరం జాఫర్‌ ట్విటర్‌ వేదికగా పలు  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల అనంతరం వెస్టిండీస్‌పై సెంచరీ సాధించి కోహ్లి తన పరుగుల దాహం తీర్చుకున్నాడని ప్రశంసించాడు.  ప్రసుత ఫామ్‌ దృష్ట్యా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి వన్డేల్లో సులువుగా 75-80 శతకాలు నమోదు చేస్తాడని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా తన అంచనా తప్పకుండా నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా తరుపున 31 టెస్టులాడిన జాఫర్‌ 34.11 సగటుతో 1944 పరుగులు సాధించాడు. ఇందులో రెండు డబుల్‌ సెంచరీలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం జాఫర్‌ బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్నాడు. 

ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి అనంతరం జాఫర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీని టెస్టులకే పరిమితం చేసి, రోహిత్‌ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బీసీసీఐకి సూచించిన విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్‌పై సాధించిన శతకం కోహ్లికి 42వది కావడం విశేషం. మరో ఎనిమిది సెంచరీలు సాధిస్తే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌(49) రికార్డును బ్రేక్‌ చేస్తాడు. ఇక ఇప్పటివరకు 238 వన్డేలు ఆడిన కోహ్లి 59.91 సగటుతో 11,406 పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు, 54 అర్దసెంచరీలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా పరుగుల పరంగా వన్డేల్లో సచిన్‌(18,426) తర్వాత స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు. (చదవండి: పాట వినిపిస్తే చాలు చిందేస్తా)

మరిన్ని వార్తలు