చెలరేగిన వసీం జూనియర్‌

20 Jan, 2020 12:34 IST|Sakshi

కుప్పకూలిన స్కాట్లాండ్‌..పాకిస్తాన్‌ భారీ విజయం

పోచెఫ్‌స్ట్రూమ్‌(దక్షిణాఫ్రికా): అండర్‌-19 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ శుభారంభం చేస్తే, పాకిస్తాన్‌ కూడా తమ తొలి మ్యాచ్‌లో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-సిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ విజృంభించి ఆడింది. సంచలనాలకు మారుపేరైన స్కాట్లాండ్‌ను తొలుత  23.5 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చిన పాకిస్తాన్‌.. ఆపై  11.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో మెగా టోర్నీలో పాకిస్తాన్‌ సైతం శుభారంభం చేసింది. (ఇక్కడ చదవండి: యువ భారత్‌ శుభారంభం)

పాకిస్తాన్‌ బౌలర్లలో పేసర్‌ మహ్మద్‌ వసీం జూనియర్‌ ఐదు వికెట్లతో స్కాట్లాండ్‌ పతనాన్ని శాసించాడు. 7.5 ఓవర్లలో రెండు మెయిడన్ల సాయంతో 12 పరుగులే ఇచ్చిన వసీం.. స్కాట్లాండ్‌ జట్టులోని సగం వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మరొకవైపు తాహీర్‌ హుస్సేన్‌ మూడు వికెట్లు సాధించగా, అబ్బాస్‌ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. దాంతో స్కాట్లాండ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అటు తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన పాకిస్తాన్‌ ఓపెనర్ల వికెట్లను నాలుగు పరుగులకే కోల్పోయింది. మహ్మద్‌ షెహజాద్‌ డకౌట్‌ కాగా, హైదర్‌ ఆలీ(4) విఫలమయ్యాడు. ఆపై ఇర్ఫాన్‌ ఖాన్‌(38 నాటౌట్‌)కు జతగా రోహైల్‌ నాజిర్‌(27)లు పాకిస్తాన్‌ను ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా,  ఖాసీం అక్రమ్‌(5 నాటౌట్‌) ఫోర్‌ కొట్టి పాకిస్తాన్‌ను గెలిపించాడు. 

>
మరిన్ని వార్తలు