మేం తుస్ కాదు.. మీరే చూస్తారుగా!

6 Apr, 2017 11:12 IST|Sakshi
మేం తుస్ కాదు.. మీరే చూస్తారుగా!

న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాడు. తమ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్‌ ఖాళీ అయిపోయిందంటూ వదంతులు ప్రచారం కావడంపై స్పందించాడు. గత ఐపీఎల్ సీజన్లలో ప్లే ఆఫ్‌కు తాము అర్హత సాధించిన విషయాన్ని గుర్తించాలన్నాడు. కేవలం ఇద్దరు కీలక ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా క్రికెటర్లు క్వింటన్ డికాక్, జేపీ డుమిని జట్టుకు దూరమైనంత మాత్రాన ఢిల్లీ పనైపోయిందంటూ ప్రచారమవుతున్న ఊహాగానాలను తెరదించాడు మిశ్రా. డుమిని వ్యక్తిగత కారణాలతో తప్పుకోగా, గాయం కారణంగా డికాక్ సేవలను కోల్పోవడం బాధిస్తోందని తెలిపాడు. గాయం నుంచి కోలుకుంటే డికాక్ జట్టులో చేరతాడని ధీమా వ్యక్తం చేశాడు.

కోరే అండర్సన్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఏంజెలో మాథ్యూస్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, సంజు శాంసన్ లాంటి స్టార్ ప్లేయర్లో ఈసారి బరిలోకి దిగుతున్నామని ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. 'డేర్ డెవిల్స్ 2012లో ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఎన్నో ఉత్తమ ప్రదర్శనలు చేశాం. గత మూడేళ్లలో జట్టులో ఎంతో మార్పు వచ్చింది. ఈ సీజన్లలో సమష్టిగా రాణించి అద్భుతాలు సృష్టిస్తాం. జహీర్‌ఖాన్, క్రిస్ మోర్గాన్, కగిసో రబాడ, పాట్ కమ్మిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్లు, నేను, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, ఎం అశ్విన్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లం ఉన్నాం. మ్యాచ్ గమనాన్ని మార్చివేసేందుకు ఒక్క మంచి బంతి చాలు. బ్యాట్స్‌మెన్ బంతి వైవిధ్యాన్ని అంచనా వేయకుండా బౌలింగ్ తో దాడి మొదలు పెడతాం. బ్యాట్స్‌మన్లు మిగతా పనిని పూర్తిచేస్తారు' అని డేర్ డెవిల్స్ ప్లేయర్ అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు