‘కేకేఆర్‌ను ఓడించే సత్తా ఉంది’

14 May, 2018 18:54 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజృంభించి ఆడుతోంది. హ్యాట్రిక్‌ విజయాలు ఆ జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చాయి. పటిష్టమైన కింగ్స్‌ పంజాబ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లపై వరుసగా విజయాలను నమోదు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌.. తన తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది.

దీనిలో భాగంగా మాట్లాడిన రాజస్తాన్‌ పేసర్‌ ధావల్‌ కులకర్ణి.. తదుపరి మ్యాచ్‌లో కూడా జోరును కొనసాగాస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ మాకు మిగిలిన రెండు మ్యాచ్‌లు అత్యంత కీలకం. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించడంపైనే మా దృష్టి ఉంది. మా జట్టుకు కోల్‌కతాను ఓడించే సత్తా ఉంది. వరుస విజయాలు తీసుకొచ్చిన ఉత్సాహాన్ని కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా పునరావృతం చేస్తాం’ అని ధావల్‌ కులకర్ణి ధీమా వ్యక్తం చేశాడు.

ఇప్పటివరకూ రాజస్తాన్‌ రాయల్స్‌ 12 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఇక ఆ జట్టుకు రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధిస్తే మాత్రం ప్లే ఆఫ్‌కు చేరువగా వస్తుంది. మరొకవైపు కోల్‌కతా కూడా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో విజయం ముఖ్యం. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం.

మరిన్ని వార్తలు