అయ్యర్‌ స్థానంపై కుంబ్లే కీలక వ్యాఖ్యలు

13 Dec, 2019 16:28 IST|Sakshi

అతనికి సరైన ‘స్థానం’ ఇవ్వడం లేదు

ముంబై: ప్రస్తుత భారత క్రికెట్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఎంతో నాణ్యమైన ఆటగాడని మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే పేర్కొన్నాడు. కానీ అతని సేవల్ని పూర్తిగా వినియోగించుకోవడంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ విఫలం అవుతుందని కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పదే పదే మార్చడాన్ని కుంబ్లే ప్రధానంగా తప్పుబట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో అయ్యర్‌ను ఐదు,ఆరు స్థానాల్లో పంపడాన్ని ప్రస్తావించాడు. ఆ స్థానాల్లో అయ్యర్‌ను పంపడం సరైనది కాదని స్పష్టం చేశాడు. ఒక క్వాలిటీ ఆటగాడైన అయ్యర్‌కు కీలకమైన నాల్గో స్థానమే కరెక్ట్‌ అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.

రాబోవు వన్డే సిరీస్‌లో అయ్యర్‌ను నాల్గో స్థానంలో పంపాలని కుంబ్లే సూచించాడు. ‘ శిఖర్‌ ధావన్‌ జట్టులో లేని కారణంగా కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ ఓపెనింగ్‌ చాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. దాంతో అయ్యర్‌ను నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి ఆస్కారం ఉంటుంది. మనం అయ్యర్‌ ఆటను చూస్తునే ఉన్నాం. అత్యంత నిలకడగా నాణ్యమైన క్రికెట్‌ ఆడుతున్నాడు. అతన్ని మళ్లీ నాల్గో స్థానంలో చూడాలనుకుంటున్నా’ అని కుంబ్లే పేర్కొన్నాడు. కాగా, విండీస్‌ వన్డే సిరీస్‌ కఠినంగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు కుంబ్లే. విండీస్‌ జట్టులో పవర్‌ఫుల్‌ హిట్టర్లు ఉన్నారని, దాంతో మన వన్డే బౌలింగ్‌లో మరింత పదును పెరగాలన్నాడు. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్‌ నాలుగు పరుగులే చేశాడు. ఇక రెండో టీ20లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చివరి టీ20లో అయ్యర్‌ ఇంకా రెండు బంతులు మాత్రమే ఉండగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. దాంతో స్టైకింగ్‌ చేసే అవకాశం రాలేదు.

మరిన్ని వార్తలు