గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నాం

23 Sep, 2016 11:01 IST|Sakshi
గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నాం

చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత క్రీడాకారులు గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నారని గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అన్నాడు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ఈ టోర్నీలో బాలుర బృందం నాలుగో స్థానంలో, బాలికల జట్టు ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. స్వదేశానికి చేరుకున్న అతను టోర్నీ ఫలితాల్ని విశ్లేషించాడు. ఈ ఈవెంట్‌లో భారత జట్లు ఓవరాల్‌గా చక్కని ఆటతీరునే కనబర్చాయని చెప్పిన అతను పతకం దక్కకపోవడానికి కొన్ని గేముల ఫలితాలే కారణమన్నాడు.

 

‘కొందరు ఆటగాళ్లు మంచి ఎత్తులతో ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని కనబరిచారు. గెలవాల్సిన ఆ మ్యాచ్‌ల్ని డ్రాతో ముగించడం వల్లే పతకాన్ని మూల్యంగా చెల్లించుకున్నాం’ అని హరి వివరించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ హరికృష్ణ ఈ టోర్నీలో చక్కని పోరాటంతో ఆకట్టుకున్నాడు. ప్రపంచ 9వ ర్యాంకర్ సెర్గెయ్ కర్జాకిన్ (రష్యా), మమెద్యరోవ్ (అజర్‌బైజాన్)లను కంగుతినిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ సంచలనం ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో గేమును డ్రా చేసుకున్నాడు.
 

మరిన్ని వార్తలు