‘రాహుల్‌ ఔటైన తర్వాత అదే అనుకున్నాం’

20 Jan, 2020 10:26 IST|Sakshi

రిస్క్‌ చేస్తానని కోహ్లికి చెప్పా: రోహిత్‌

బెంగళూరు: మూడు వన్డేల సిరీస్‌ విజేతను నిర్ణయించే మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ(119, 128 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాం. 290 పరుగులలోపే ఆసీస్‌ను కట్టడి చేయాలనే మా ప్రణాళిక సక్సెస్‌ అయ్యింది. ఇది చాలా కీలకమైన మ్యాచ్‌. సిరీస్‌ను డిసైడ్‌ చేసే మ్యాచ్‌. రాహుల్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించడానికి యత్నించా. (ఇక్కడ చదవండి: కంగారెత్తించాం)

రాహుల్‌ ఔటైన తర్వాత కోహ్లి కలిసి భారీ భాగస్వామ్యం సాధించాలని మేమిద్దరం అనుకున్నాం. ఆ సమయంలో భారీ భాగస్వామ్యాన్ని నిర్మించడానికి కోహ్లి కంటే  మంచి బ్యాట్స్‌మన్‌ మరొకరు ఉండరు. అందుచేత బాధ్యతాయుతంగా ఆడాం. ఒకరు డిఫెన్స్‌, మరొకరు ఎఫెన్స్‌ అని నిర్ణయించుకున్నాం. నేనే నా సహజ శైలిలో ఆడతానని కోహ్లికి చెప్పా. రిస్క్‌ చేస్తానని  చెప్పా. ఆసీస్‌ టాప్‌-3 బౌలర్ల నుంచి మాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినా దాని అధిగమించాం. దాంతోనే వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాం’ అని రోహిత్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌-కోహ్లిలు 137 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో భారత్‌ విజయం సునాయాసమైంది.

మరిన్ని వార్తలు