‘కరోనాపై పోరాటంలో గెలుస్తాం’

27 Mar, 2020 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ:  ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయంలో అంతా సానుకూల ధోరణితో ముందుకు సాగాలని టీమిండియా దిగ్గజ ఆల్‌ రౌండర్‌ కపిల్‌దేవ్‌ పిలుపునిచ్చాడు. ఈ పోరాటంలో గెలవడానికి ముందుగా మనమంతా చేయాల్సింది ఇంట్లో ఉండటమేనన్నాడు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వైరస్‌ను నిరోధించాలంటే ఎవరు ఇళ్లల్లో వారు ఉండటమే ఉత్తమం అని పేర్కొన్నాడు ప్రస్తుత పరిస్థితిని ప్రతీ ఒక్కరూ చాలెంజ్‌గా తీసుకోవాల్సి ఉందని కపిల్‌ తెలిపారు. ఇప్పుడు నీ ప్రపంచం నీ ఇంట్లోనే ఉందనే విషయం తెలుసుకోవాలన్నాడు. పుస్తకాలు చదువుతూ, టీవీ చూస్తూ, మ్యూజిక్‌ వింటూ నచ్చిన పనులు చేస్తూ వచ్చే వినోదాన్ని ఆస్వాదించాలన్నాడు.  (సచిన్‌ తలో  రూ. 25 లక్షలు..)

ఈ  ఖాళీ సమయంలో తాను కూడా లాక్‌డౌన్‌లో ఉండి కొన్ని ఇంటి పనులను చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని కపిల్‌ తెలిపాడు. ‘నేను ఇంటిని ఊడ్చుతున్నా. గార్డెన్‌ను క్లీన్‌ చేస్తున్నా. నా చిన్న గార్డెన్‌ ఇప్పుడు గోల్ఫ్‌ ఆడే స్థలంగా కూడా మారిపోయింది. ఇక ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నా. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మిస్సయ్యానో దాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నా’ అని కపిల్‌ పేర్కొన్నాడు.  ఈ క్లిష్ట సమయంలో ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దన్నాడు. ఇక్కడ ధైర్యాన్నికోల్పోవడం​ అంటే బయటకెళ్లి తిరగడం కాదని, ఇంటి పట్టునే ఉండి కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలన్నాడు. అలా చేస్తే కరోనాపై మనదే విజయమన్నాడు. ఇక క్రికెట్‌ పరిభాషలో చెప్పాలంటే.. ‘ నీవు సెంచరీ చేసిన తర్వాత ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయినా, ఒక మంచి బౌలింగ్‌ స్పెల్‌ తర్వాత వికెట్‌ లేకండా మరొక ఇన్నింగ్స్‌ను ముగించినా విశ్వాసాన్ని కోల్పోవద్దు. అలాంటిదే ఇప్పుడు కరోనాపై చేస్తున్న పోరాటం. నమ్మకాన్ని వదలొద్దు’ అని కపిల్‌ తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు చేపట్టిన  చర్యలకు అంతా సహకరించాల్సి ఉందన్నాడు. (ఏమిరా చహల్‌.. మొన్న వీధిలో.. ఇప్పుడు ఇంట్లో!)

మరిన్ని వార్తలు