ఏ జట్టుకైనా ఇదే పరిస్థితి: అండర్సన్‌

11 Aug, 2018 15:25 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తన తొలి ఇన‍్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు టీమిండియా బ్యాటింగ్‌కు దిగి పేకమేడలా కుప్పకూలింది. ఇంగ్లండ్‌ పేసర్ల ధాటిగా తలవంచిన విరాట్‌ గ్యాంగ్‌ కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. ప్రధానంగా ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.

తమ ప్రదర్శనపై మ్యాచ్‌ తర్వాత మాట్లాడిన అండర్సన్‌.. ఈ తరహా పిచ్‌లపై ఏ జట్టునైనా ఆలౌట్‌ చేస్తామని, అది ఒక్క టీమిండియాకే పరిమితం కాదంటూ చెప్పుకొచ్చాడు. ‘ పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా పరిస్థితుల్లో మేము మంచి బౌలింగ్‌ వేశాము. దాంతోనే టీమిండియానే స్వల్ప స్కోరుకే పరిమితం చేశాం. పిచ్‌ అనేది సీమ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రపంచంలోని మేటి జట్లను సైతం మేము ఆలౌట్‌ చేసిన సందర్బాల్లో చాలానే ఉన్నాయి.

ఇంగ్లండ్‌లో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ తరహా వాతావరణ పరిస్థితి అనేది ఎదురవుతుంది. గాలిలో  తేమ అనేది మా బౌలింగ్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక‍్కడ మేము బాగా కష్టపడిపోయామని చెప్పలేను. మంచి బంతులు వేయడంపైనే దృష్టి సారించాం. అదే సమయంలో వైవిధ్యాన్ని జోడించాం. దాంతో టీమిండియాను తొందరగా ఆలౌట్‌ చేయడం సాధ్యపడింది. ఒకవేళ సీమ్‌కు అనుకూలంగా ఉన్న లార్డ్స్‌ పిచ్‌లో నేను వికెట్లు తీయకపోతే చాలా నిరాశ చెందేవాడిని. నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది ’ అని అండర్సన్‌ స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు