వెస్టిండీస్‌ శుభారంభం

9 Jan, 2020 00:02 IST|Sakshi

తొలి వన్డేలో 5 వికెట్లతో ఐర్లాండ్‌పై గెలుపు

రాణించిన జోసెఫ్, లూయిస్‌

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి వన్డేలో విండీస్‌ 5 వికెట్లతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత ఐర్లాండ్‌ను పేసర్‌ అల్జారి జోసెఫ్‌ (4/32) దెబ్బతీయడంతో ఆ జట్టు 46.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. టక్కర్‌ (68 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం ఛేదన ప్రారంభించిన విండీస్‌ 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది.ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (99 బంతుల్లో 99 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. 33.1 ఓవర్లో విండీస్‌ స్కోరును సమం చేయగా... లూయిస్‌ 95 పరుగుల వద్ద నిలిచాడు. ఆ తర్వాతి బంతిని లూయిస్‌  సిక్సర్‌గా మలిస్తే శతకం సాధించే అవకాశం ఉండగా... అతను ఫోర్‌ కొట్టాడు. దీంతో అతను సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు జోసెఫ్‌కు లభించింది.   

మరిన్ని వార్తలు