సెంచరీలతో షాక్‌ ఇచ్చారు

16 Dec, 2019 00:58 IST|Sakshi
హెట్‌మైర్‌

చెరో శతకం బాదిన హెట్‌మైర్, షై హోప్‌  తొలి వన్డేలో భారత్‌పై

8 వికెట్ల తేడాతో విండీస్‌ జయభేరి

టాపార్డర్‌ను పడేసిన కాట్రెల్‌

రాణించిన అయ్యర్, పంత్‌

రెండో వన్డే 18న వైజాగ్‌లో 

టి20 సిరీస్‌ గెలిచి ఊపు మీదున్న భారత్‌కు వెస్టిండీస్‌ గట్టి షాకే ఇచ్చింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఊహించని రీతిలో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల మధ్య ఒక్కటే తేడా... భారత టాపార్డర్‌ (రోహిత్, రాహుల్, కోహ్లి) చేతులెత్తేస్తే... ప్రత్యర్థి టాపార్డర్‌ ఆడుతూ పాడుతూ భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. విండీస్‌ ఓపెనర్‌ షై హోప్, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్‌ శతకాలతో కదంతొక్కి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.   

చెన్నై: వన్డే సిరీస్‌లో తొలి పంచ్‌ కరీబియన్‌దే. టీమిండియాకు ఊహించని షాక్‌ ఇచ్చిన వెస్టిండీస్‌ యువ జట్టు తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా  భారత్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  287 పరుగులు చేసింది. అయ్యర్‌ (88 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్‌), పంత్‌ (69 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, జోసెఫ్‌ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత వెస్టిండీస్‌ 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ షై హోప్‌ (151 బంతుల్లో 102 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెట్‌మైర్‌ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) భారత్‌పై ఫైర్‌ అయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌ 1–0తో ముందంజ వేసింది. రెండో వన్డే ఈనెల 18న విశాఖపట్నంలో జరుగుతుంది.  

ఇద్దరే ఇరగదీశారు...

భారత్‌ నిర్దేశించిన లక్ష్యం 288 పరుగులు కష్టమైందే! కానీ విండీస్‌ మాత్రం ఇద్దరంటే ఇద్దరితో సులువుగా ఛేదించేసింది. మొదట నింపాదిగా ఆడి 10 ఓవర్ల తర్వాత ఆటతీరు మార్చుకుంది. విజయానికి అవసరమైన రన్‌రేట్‌ పడిపోకుండా... పరుగుల్ని చకాచకా చేసేసింది. తొలుత ఆట మొదలైన కాసేపటికే అంబ్రిస్‌ (9) వికెట్‌ను చాహర్‌ బౌలింగ్‌లో కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ ఇచి్చన ఈ ఆనందం మ్యాచ్‌ సాగేకొద్దీ ఆవిరైంది. పవర్‌ప్లే పది ఓవర్లలో వికెట్‌ నష్టానికి 36 పరుగులే చేసిన విండీస్‌ తర్వాత విజయమే లక్ష్యంగా అడ్డుఅదుపూ లేకుండా సాగిపోయింది. ఓపెనర్‌ హోప్‌ అండతో హెట్‌మైర్‌ చెలరేగాడు. 50 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... విండీస్‌ 21.3 ఓవర్లో వంద పరుగులు దాటింది. అర్ధసెంచరీ తర్వాత హెట్‌మైర్‌ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు.

నింపాదిగా ఆడిన హోప్‌ 92 బంతుల్లో ఫిఫ్టీ చేయగా... హెట్‌మైర్‌ 85 బంతుల్లోనే (8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ బాదాడు. కోహ్లి పేసర్లను, స్పిన్నర్లను మార్చినా, పార్ట్‌టైమ్‌ బౌలర్లతో బౌలింగ్‌ వేయించినా... ఈ జోడీ ని మాత్రం విడగొట్టలేకపోయాడు. హెట్‌మైర్‌ వ్యక్తిగత స్కోరు 106 పరుగుల వద్ద అతను ఇచి్చన క్యాచ్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ వదిలేశాడు. 36వ ఓవర్లో వెస్టిండీస్‌ స్కోరు 200 పరుగులకు చేరింది. దుర్భేధ్యంగా సాగిపోతున్న ఈ భాగస్వామ్యాన్ని షమీ గెలుపుదారిన పడిన తర్వాతే విడగొట్టగలిగాడు. జట్టు స్కోరు 229 వద్ద హెట్‌మైర్‌ను ఔట్‌ చేయడంతో 218 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత హోప్‌కు నికోలస్‌ పూరన్‌ (29 నాటౌట్‌; 4 ఫోర్లు) జతయ్యాడు. ఇతని అండతో 149 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ పూర్తి చేసిన హోప్‌... జట్టు గెలిచేదాకా అజేయంగా నిలిచాడు.  

కోహ్లి బౌల్డ్‌...

టాస్‌ నెగ్గిన విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌ బౌలింగ్‌కే మొగ్గు చూపాడు. తన కెప్టెన్ నిర్ణయం సరైందేనని లెఫ్టార్మ్‌ పేసర్‌ కాట్రెల్‌ చేతల్లో చూపాడు. భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ అతని మూడో ఓవర్లోగానీ పరుగులు చేయలేకపోయారు. 6 ఓవర్లయిన భారత్‌ (19/0) ఇరవై పరుగులు చేయలేకపోయింది. అసలే చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను కాట్రెల్‌ దెబ్బ మీద దెబ్బ తీసి కష్టాల్లో పడేశాడు. ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ (6)ను హెట్‌మైర్‌ క్యాచ్‌తో బొల్తా కొట్టించిన కాట్రెల్, ఆఖరి బంతికి కెప్టెన్ కోహ్లి (4)ని బౌల్డ్‌ చేశాడు. అంతే 25 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. తర్వాత ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ను మెయిడెన్‌గా వేశాడు. అంటే కాట్రెల్‌ తన 5 ఓవర్ల స్పెల్‌లో మూడు ఓవర్లు పరుగు ఇవ్వకుండానే ముగించడం విశేషం.

ఆదుకున్న అయ్యర్, పంత్‌...

తర్వాత రోహిత్‌ శర్మ (56 బంతుల్లో 36; 6 ఫోర్లు)కు శ్రేయస్‌ అయ్యర్‌ జతయ్యాడు. ఇద్దరు ఆచితూచి ఆడారు. జట్టు 13వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. పరుగుల వేగం పెరుగుతున్న దశలో జోసెఫ్‌ బౌలింగ్‌లో ‘హిట్‌మ్యాన్‌’ అవుటయ్యాడు. దీంతో భారత్‌ 80 పరుగులకే కీలకమైన మూడు టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రిషభ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. 25వ ఓవర్లో భారత్‌ 100 పరుగులు పూర్తయ్యాయి. ధోని వారసుడిగా వచ్చిన పంత్‌ ఎట్టకేలకు ధోని ఐపీఎల్‌ గడ్డ (చెన్నై)పై జట్టుకు అక్కరకొచ్చే ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఒక్క సిక్సర్‌ లేని ఇన్నింగ్స్‌కు ఆ మెరుపు వెలతి తీర్చాడు. ఎట్టకేలకు స్పిన్నర్‌ చేజ్‌ బౌలింగ్‌లో పంత్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు. అలా 28 ఓవర్లకుగానీ భారత ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ నమోదైంది. రన్‌రేట్‌ కూడా మెరుగవడంతో 31.3 ఓవర్లోనే 150 పరుగులుకు చేరింది. ఈ క్రమంలోనే అయ్యర్‌ 70 బంతుల్లో, పంత్‌ 49 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. వన్డేలో పంత్‌కి ఇదే తొలి అర్ధ సెంచరీ. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 194 జట్టు స్కోరు వద్ద శ్రేయస్, మరో 16 పరుగుల వ్యవధిలో 210 వద్ద పంత్‌ ని్రష్కమించారు. అనంతరం కేదార్‌ జాదవ్‌ (35 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా (21 బంతుల్లో 21; 2 ఫోర్లు) ధాటిగా ఆడి ఆఖరి ఓవర్లలో ఔటయ్యారు.

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) పొలార్డ్‌ (బి) జోసెఫ్‌ 36; రాహుల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) కాట్రెల్‌ 6; కోహ్లి (బి) కాట్రెల్‌ 4; శ్రేయస్‌ (సి) పొలార్డ్‌ (బి) జోసెఫ్‌ 70; పంత్‌ (సి) హెట్‌మైర్‌ (బి) పొలార్డ్‌ 71; కేదార్‌ (సి) పొలార్డ్‌ (బి) కీమో పాల్‌ 40; జడేజా (రనౌట్‌) 21; శివమ్‌ దూబే (సి) హోల్డర్‌ (బి) కీమో పాల్‌ 9; చాహర్‌ (నాటౌట్‌) 6; షమీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 287.
వికెట్ల పతనం: 1–21, 2–25, 3–80, 4–194, 5–210, 6–269, 7–269, 8–282. బౌలింగ్‌: కాట్రెల్‌ 10–3–46–2, హోల్డర్‌ 8–0–45–0, వాల్‌‡్ష 5–0–31–0, కీమోపాల్‌ 7–0–40–2, జోసెఫ్‌ 9–1–45–2, చేజ్‌ 7–0–42–0, పొలార్డ్‌ 4–0–28–1.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హోప్‌ (నాటౌట్‌) 102; అంబ్రిస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్‌ చాహర్‌ 9; హెట్‌మైర్‌ (సి) అయ్యర్‌ (బి) షమీ 139; పూరన్‌ (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (47.5 ఓవర్లలో 2 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–11, 2–229. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 10–1–48–1, షమీ 9–1–57–1, కుల్దీప్‌ 10–0–45–0, దూబే 7.5–0–68–0, కేదార్‌ జాదవ్‌ 1–0–11–0, రవీంద్ర జడేజా 10–0–58–0.

మరిన్ని వార్తలు