40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు..

22 Dec, 2019 20:53 IST|Sakshi

కటక్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరిదైన సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా తడబడుతూనే పోరాడుతోంది. విండీస్‌ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ(63), కేఎల్‌ రాహుల్‌(77)లు అర్థ శతకాలు చేసి ఔట్‌ కాగా, శ్రేయస్‌ అయ్యర్‌(7), రిషభ్‌ పంత్‌(7)లు నిరాశపరిచారు. వీరిద్దరూ అనవసరపు షాట్లకు యత్నించి స్వల్ప వ్యవధిలో ఔట్‌ అయ్యారు. కీమో పాల్‌ వేసిన 33 ఓవర్‌ మూడో బంతికి ఫైన్‌ లెగ్‌ మీదుగా అయ్యర్‌ భారీ షాట్‌ ఆడి ఔటయ్యాడు. కీమో పాల్‌ ఊరిస్తూ లెగ్‌ మీదుకు వేసిన షార్ట్‌ బాల్‌నుఅయ్యర్‌ ఆడగా అది క్యాచ్‌గా లేచింది.

కాగా,  అల్జెరీ జోసెఫ్‌ అద్భుతంగా క్యాచ్‌ అందుకోవడంతో అయ్యర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అటు తర్వాత కాసేపటికి పంత్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. కీమో పాల్‌ వేసిన 35 ఓవర్‌ ఆఖరి బంతిని లెట్‌ కట్‌ షాట్‌ ఆడి పంత్‌ మూల్యం చెల్లించుకున్నాడు. కాసేపటికి కేదార్‌ జాదవ్‌(9) బౌల్డ్‌ అయ్యాడు. కాట్రెల్‌ వేసిన 39 ఓవర్‌ ఐదో బంతికి జాదవ్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో భారత జట్టు 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 188 పరుగుల వద్ద అయ్యర్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, 201 పరుగుల వద్ద పంత్‌ పెవిలియన్‌ చేరాడు. 228 పరుగుల వద్ద జాదవ్‌ నిష్క్రమించాడు. 

మరిన్ని వార్తలు