ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లలేం

4 Jun, 2020 05:56 IST|Sakshi
హెట్‌మైర్, కీమో పాల్‌

విండీస్‌ క్రికెటర్లు బ్రేవో, హెట్‌మైర్, కీమో పాల్‌ ప్రకటన

సెయింట్‌ జాన్స్‌: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం తాము ఇంగ్లండ్‌లో పర్యటించబోమని వెస్టిండీస్‌ ఆటగాళ్లు డారెన్‌ బ్రేవో, షిమ్రోన్‌ హెట్‌మైర్, కీమో పాల్‌ వెల్లడించారు. దాంతో ఈ సిరీస్‌ కోసం ఈ ముగ్గురి పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా 14 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్‌ వెస్టిండీస్‌ (సీడబ్ల్యూఐ) ప్రకటించింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఎన్‌క్రుమా బోనెర్, పేస్‌ బౌలర్‌ చెమర్‌ హోల్డర్‌ తొలిసారి విండీస్‌ టెస్టు జట్టులోకి వచ్చారు. బయో–సెక్యూర్‌ పరిస్థితుల నడుమ నిర్వహించే ఈ సిరీస్‌ కోసం ఎంపికైన ఆటగాళ్లందరికీ కోవిడ్‌–19 టెస్టులు చేస్తారు. అనంతరం జూన్‌ 8న చార్టెర్డ్‌ ఫ్లయిట్‌లో విండీస్‌ క్రికెటర్లు ఇంగ్లండ్‌కు బయలుదేరుతారు. తొలి టెస్టును హాంప్‌షైర్‌లో జూలై 8 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. అనంతరం రెండో టెస్టు జూలై 16 నుంచి 20 వరకు... మూడో టెస్టు జూలై 24 నుంచి 28 వరకు ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరుగుతాయి.  

విండీస్‌ టెస్టు జట్టు: జేసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్, షై హోప్, డౌరిచ్, రోస్టన్‌ చేజ్, షెమారా బ్రూక్స్, రఖీమ్‌ కార్న్‌వాల్, ఎన్‌క్రుమా బోనెర్, అల్జారి జోసెఫ్, చెమర్‌ హోల్డర్, జాన్‌ క్యాంప్‌బెల్, రేమన్‌ రీఫర్, కీమర్‌ రోచ్, జెర్మయిన్‌ బ్లాక్‌వుడ్‌.

 

మరిన్ని వార్తలు