మొహాలి: ట్వంటీ 20 మహిళల ప్రపంచకప్లో భాగంగా గ్రూప్-బిలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ 115 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ చేపట్టడంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టులో స్టెఫనీ టేలర్(47), దియాంద్రా డోటిన్(45)లు మాత్రమే రాణించారు. కట్టుదిట్టమైన భారత బౌలింగ్ కు ఏడుగురు విండీస్ క్రీడాకారిణులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 114 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో హర్మన్ కౌర్ నాలుగు వికెట్లు సాధించగా, అనుజా పాటిల్ కు మూడు వికెట్లు, ఏక్తా బిష్త్ కు ఒక వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో భారత్ జట్టు వెస్టిండీస్పై గెలిస్తే చెన్నైలో సాయంత్రం జరిగే ఇంగ్లండ్-పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్లో పాక్ కచ్చితంగా ఓడిపోతే అప్పుడే మనకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అదే జరిగితే గ్రూప్ బి లో భారత్, వెస్టిండీస్, పాకిస్తాన్ రెండేసి విజయాలు, నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. మిగతా రెండు జట్లతో పోలిస్తే టీమిండియా రన్రేట్ చాలా బాగుంది కాబట్టి జట్టు ముందంజ వేస్తుంది. అదే పాక్ గెలిస్తే భారత్ నిష్ర్కమిస్తుంది.