ఇది సిగ్గు పడాల్సిన ఘటన: కోహ్లి

1 Dec, 2019 10:25 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందించాడు. ఇది సభ్య సమాజం సిగ్గు పడాల్సిన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  ‘హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం ఎంతో సిగ్గుచేటు. మనం బాధ్యత తీసుకొని ఇలాంటి అమానవీయ చర్యలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది’ అని విరాట్‌ ట్విటర్‌లో తెలిపాడు.

ఇక భార్య అనుష్క శర్మను పలువురు టార్గెట్‌ చేయడంపై కోహ్లి పెదవి విరిచాడు. ప్రతీ ఒక్కరికి తన భార్య అనుష్క శర్మ సులువైన లక్ష్యంగా మారిందన్నాడు. ప్రపంచకప్‌ సమయంలో అనుష్కకు ఓ సెలెక్టర్‌ టీ అందించాడంటూ ఇటీవల మాజీ ఆటగాడు ఫరూఖ్‌ ఇంజనీర్‌ వ్యాఖ్యలు చేశాడు.  దీనిపై కోహ్లి మాట్లాడుతూ.. ‘శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ను చూసేందుకు అనుష్క స్టేడియానికి వచ్చింది. అది కూడా ఆమె సెలెక్టర్ల బాక్స్‌లో కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చుంది. ఆమెతో ఏ సెలెక్టర్‌ కూడా లేడు. అసెలెక్టర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా నా భార్య పేరును తీసుకురావడం ఎందుకు? అదేపనిగా ఏవేవో మాట్లాడితే అవేమీ నిజాలు కావు’ అని కోహ్లి రిప్లై ఇచ్చాడు.

మరిన్ని వార్తలు