ఆ క్యాచ్‌ శ్రీశాంత్‌ వదిలేస్తే.. చెంప పగిలేది: హర్భజన్‌

19 Sep, 2018 15:29 IST|Sakshi
హర్భజన్‌ సింగ్‌

ముంబై: భారత్‌ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్‌( 2007) ఫైనల్‌ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠకరంగా సాగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తుదిపోరులో పేసర్‌ శ్రీశాంత్‌ అద్భుత క్యాచ్‌తో భారత్‌ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యాచ్‌ను శ్రీశాంత్‌ వదిలేసి ఉంటే అతనిపై చేయిచేసుకునేవాడినని టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు. ఇండియా టుడే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్‌ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి 2011 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కూడా కలగలేదని అభిప్రాయపడ్డాడు.
 
‘అదో అద్భుత సందర్భం. ఆ ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి.. 2011 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కూడా అనిపించలేదు. ఈ విజయంతో భారత్‌ చేరుకున్నప్పుడు ముంబై వీధుల్లో జనాలు నిలబడి స్వాగతం పలకడం ఇంకా కళ్ల ముందే కదలుతోంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి వాంఖెడే స్టేడియం చేరుకోవడానికి 6 గంట ల సమయం పట్టింది. ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ ఆ క్యాచ్‌ను అందుకోవడం నిజంగా లక్కే. మిస్బా తన షాట్‌ను సరిగ్గా ఆడలేదు. ఆ అవకాశాన్ని శ్రీశాంత్‌ అందిపుచ్చుకున్నాడు. ఒకవేళ శ్రీశాంత్‌ ఆ క్యాచ్‌ వదిలేసి ఉంటే.. ఈ టోర్నీ అనంతరం ఐపీఎల్‌లో జరిగిన ఘటన ముందే చోటుచేసుకునేది’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు. 2008 ఐపీఎల్‌ సందర్భంగా హర్భజన్‌ సహనం కోల్పోయి శ్రీశాంత్‌పై మైదానంలోనే చేయిచేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠగా సాగిన నాటి ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌-పాక్‌ అభిమానులు మరిచిపోలేరు. ఇరు జట్లను కడదాక ఊరించిన విజయం చివరకు భారత్‌ వశం అయ్యింది.

మరిన్ని వార్తలు