ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లపై నిఘా

20 Jan, 2016 03:18 IST|Sakshi

నిశితంగా పరిశీలిస్తున్న నిర్వాహకులు
మెల్‌బోర్న్: మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తమను సంప్రదించారని చాలా మంది ఆటగాళ్లు  చెబుతున్న నేపథ్యంలో... సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లపై నిర్వాహకులు నిఘా పెంచారు. ప్రతి మ్యాచ్‌ను నిశితంగా పరిశీలించడంతో పాటు అనుమానం ఉన్న ఫలితాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిపెట్టారని ఆసీస్ మీడియా తెలిపింది. టాప్-50 ర్యాంక్‌ల్లో ఉన్న 16 మంది ఆటగాళ్లు తరచుగా ఫిక్సింగ్ చేసేవారని బీబీసీ, బజ్‌ఫీడ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే ఇందులో సగం మంది ప్లేయర్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ ఆడుతున్నారని తేలడంతో నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  ఆధారాలను తాము తొక్కిపెట్టడం లేదని ప్రకటించిన టెన్నిస్ నిర్వాహకులు.. ఆట సమగ్రతను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
 
పారదర్శకత ఉండాలి: ముర్రే
అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పారదర్శకత ఉండాలని బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే నిర్వాహకులపై మండిపడ్డాడు. బెట్టింగ్ కంపెనీలు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్పాన్సర్‌గా ఉండటాన్ని తప్పుబట్టాడు.  ఆస్ట్రేలియా ఆటగాడు కొకినాకిస్, బ్రిటన్ మాజీ ఆటగాడు పర్మర్ కూడా గతంలో బుకీలు తమని సంప్రదించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు