‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

15 Jul, 2019 17:13 IST|Sakshi

భారత అభిమానుల కామెంట్స్‌

విశ్వవేదికపై గెలుపు ముంగిట న్యూజిలాండ్‌ బొక్కబోర్లపడటానికి ఆ జట్టు చేసుకున్న కర్మే కారణమని భారత అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. భారత్‌తో జరిగిన సెమీస్‌ పోరులో కివీస్‌ చేసిన తప్పుకు ఫలితమే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా భారత సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని రనౌట్‌ను ప్రస్తావిస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఆ మ్యాచ్‌లో మార్టిన్‌ గప్టిల్‌ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకి, ధోని రనౌట్‌తో భారత పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. అయితే తుది సమరంలో మ్యాచ్‌ టై కావడం.. ఆ తర్వాత నిర్వహించిన సూపర్‌ ఓవర్‌ ఆఖరు బంతికి రెండో పరుగు తీస్తూ గప్టిల్‌ రనౌటవ్వడం అంతా కర్మ సిద్దాంత ఫలితమేనని #Karma యాష్‌ట్యాగ్‌తో నిందిస్తున్నారు. అయితే ధోని రనౌట్‌ విషయంలో కివీస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఫీల్డింగ్‌ పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. 

మూడో పవర్‌ ప్లేలో నిబంధనల ప్రకారం 30యార్డ్ సర్కిల్‌ బయట ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ ఆ సమయంలో కివీస్‌ ఆరుగురు ఫీల్డర్లను పెట్టిందని ప్రచారం జరిగింది. దీన్ని అంపైర్లు గుర్తించి ఉంటే అది నోబాల్ అయ్యేది. ఆ తరువాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో.. ధోని కూడా పరుగు కోసం ప్రయత్నించివాడు కాదన్నది అభిమానుల ఉద్దేశం. ఇదే విషయాన్ని ప్రస్తవిస్తూ ఈ పాపమే గప్టిల్‌, కివీస్‌కు చుట్టుకుందని మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు