‘అందుకే రోడ్స్‌ను ఫైనల్‌ లిస్ట్‌లో చేర్చలేదు’

23 Aug, 2019 12:21 IST|Sakshi

ముంబై:  టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌ శ్రీధర్‌నే తిరిగి ఎంపిక చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్‌ దిగ్గజం జాంటీ రోడ్స్‌.. టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి పోటీ పడినప్పటికీ శ్రీధర్‌వైపు సెలక్షన్‌ కమిటీ మొగ్గుచూపింది. ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అండదండలతోనే శ్రీధర్‌ను మళ్లీ నియమించారనేది కాదనలేని వాస్తవం. అయితే రోడ్స్‌ను కనీసం ఫైనలిస్టులో చేర్చకపోవడమే చర్చనీయాంశంగా మారింది.

దీనిపై చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు. ‘ఫీల్డింగ్‌ కోచ్‌ ఫైనలిస్టులో శ్రీధర్‌తో పాటు, అభయ్‌ శర్మ, టి దిలీప్‌లతోనే సరిపెట్టాం. వీరిద్దరికీ భారత్‌-ఏ జట్టుతో పని చేసిన అనుభవంతో పాటు ఎన్‌సీఏ(నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ)లో కూడా సేవలందించారు. దాంతో రోడ్స్‌ను తుది జాబితాలో ఎంపిక చేయలేదు’ అని ఎంఎస్‌కే తెలిపాడు. అయితే శ్రీధర్‌నే తిరిగి నియమించడాన్ని ఎంఎస్‌కే  సమర్ధించుకున్నాడు.‘ ఆర్‌ శ్రీధర్‌ ఒక అత్యుత్తమ ఫీల్డింగ్‌ కోచ్‌. అందులో సందేహం లేదు. టీమిండియా ఫీల్డింగ్‌ మెరుగు పడటంలో శ్రీధర్‌ పాత్ర చాలానే ఉంది. దాంతో మాకు వేరే ఆలోచన లేకుండా శ్రీధర్‌నే ఎంపిక చేశాం’ అని చెప్పుకొచ్చాడు. (ఇక్కడ చదవండి: సంజయ్‌ బంగర్‌పై వేటు)

మరిన్ని వార్తలు