సచిన్‌ కంటే ముందు ద్రవిడ్‌ ఎందుకు?

5 Jul, 2018 13:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో టీమిండియా మాజీ కెప్టెన​ రాహుల్ ద్రవిడ్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ద్రవిడ్‌తో పాటు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కూడా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేరాడు. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక‍్కించుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా ద్రవిడ్‌ నిలిచాడు. అతడి కంటే ముందు భారత తరపున బిషన్ సింగ్ బేడీ, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌కి ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు ఎందుకు దక్కలేదనే విషయం ప్రస్తుతం చర‍్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన సచిన్‌కు ఇప్పటివరకూ ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు ఎందుకు దక్కలేదనే దానిపై అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు.

కాగా, ఒక క్రికెటర్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకోవాలంటే వన్డే, టెస్టుల్లో కలిపి ఒక బ్యాట్స్‌మన్‌ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు 20 సెంచరీలు చేసి ఉండాలి. అదే సమయంలో ఒక క్రికెటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి కనీసం ఐదేళ్ల పూర్తి కావాలి. దాని ప్రకారం చూస్తే సచిన్‌ తన కెరీర్‌కు గుడ్‌ బై చెప్పి ఇంకా ఐదేళ్ల పూర్తి కాలేదు.  2013, నవంబర్‌లో సచిన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.  ఐసీసీ నిబంధనల ప‍్రకారం సచిన్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోచోటు దక్కించుకోవాలంటే ఇంకా కొంత సమయం ఉంది.  దాంతో సచిన్‌కు మిగతా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇంకా ఐదేళ్లు పూర్తి కాకపోవడంతో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.  2012లో ద్రవిడ్‌ తన చివరి మ్యాచ్ ఆడాడు. కాబట్టి అతడు ఈ ఏడాది హల్ ఆఫ్ ఫేమ్‌లో చేరాడు. వచ్చే ఏడాదికి సచిన్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి ఐదేళ్లు పూర్తవుతాయి. కాబట్టి 2019లో క్రికెట్ గాడ్ ఆ జాబితాలో చేరే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు