కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి

2 Oct, 2018 11:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల యూఏఈ వేదిక జరిగిన ఆసియాకప్‌లో టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి రోహిత్‌ శర్మ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే కోహ్లి రెస్ట్‌ ఇవ్వడంపై ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు. అసలు కోహ్లి ఎందుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందో అనే దానిపై వివరణ ఇచ్చిన రవిశాస్త్రి.. ‘ కోహ్లి చాలా అలసిపోయాడు. శారీరకంగా చూస్తే కోహ్లి పరిస్థితి ఒక ఎద్దులా మారిపోయింది. దాంతో కోహ్లి విశ్రాంతి అనివార్యమైంది.

ఒకవేళ ఆసియాకప్‌లో అతను ఆడితే అది తీవ్రమైన ప్రభావం చూపేది. గత కొంతకాలంగా విరామంగా లేకుండా క్రికెట్‌ ఆడుతున్న కోహ్లి మరింత తాజాగా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతోనే అతనికి విశ్రాంతినిచ్చాం. ఇక్కడ కోహ్లికి ఒక్కడికే కాదు.. మిగతా ఆటగాళ్ల విషయం కూడా అదే పద్ధతిని అవలంభిస్తున్నాం. పేసర్లు బూమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌లకు సైతం విశ్రాంతి అవసరమని భావించే వారిని విండీస్‌తో టెస్టు సిరీస్‌ నుంచి పక్కకు పెట్టాం. విరామం లేకుంగా క్రికెట్‌ ఆడేవారు మరింతగా రాటుదేలాలంటే విశ్రాంతి అనేది అనివార్యం’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు