విలియమ్సన్‌ సెంచరీ: పాక్‌పై కివీస్‌ గెలుపు

7 Jan, 2018 01:36 IST|Sakshi

వెల్లింగ్టన్‌: పాకిస్తాన్‌తో మొదలైన ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. తొలి వన్డేలో కివీస్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం వల్ల పాక్‌ ఇన్నింగ్స్‌ పూర్తిగా సాగలేదు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 315 పరుగులు చేసింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (115; 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. గప్టిల్‌ (48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మున్రో (58; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు); నికోల్స్‌ (43 బంతుల్లో 50; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు.

తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి పాకిస్తాన్‌ 30.1 ఓవర్లలో 6 వికెట్లకు  166 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (82 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. కివీస్‌ బౌలర్లలో సౌతీ 3, బౌల్ట్‌ 2 వికెట్లు పడగొట్టారు. బలమైన ఈదురు గాలులతో వికెట్ల మీది బెయిల్స్‌ పదే పదే పడిపోవడంతో వాటిని తీసేసి మ్యాచ్‌ను ఆడించారు. ఇరు జట్ల మధ్య 9న రెండో వన్డే జరుగనుంది. 

మరిన్ని వార్తలు